కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరిదశకు చేరింది. శుక్రవారమే చాలా జిల్లాల్లో ముగిసినప్పటికీ కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, వనపర్తి, నల్లగొండ, యాదాద్రి భువనగరి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో శనివారం కూడా పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలు అందజేశారు. గత ఏడాది కంటే ఈసారి రికార్డుస్థాయిలో సభ్యత్వాలు నమోదైనట్టు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. వనపర్తి జిల్లాలో గోపాల్పేట మండలం పొల్కెపహాడ్ పరిధిలోని కర్ణమయ్యకుంటతండావాసులు మూకుమ్మడిగా టీఆర్ఎస్ సభ్యత్వాలను స్వీకరించారు. వీరికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనయ్య, కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.