కరీంనగర్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు విస్తృత స్థాయి సమీక్ష
కరీంనగర్ అభివృద్ధిపై ప్రగతి భవన్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్ సమగ్రాభివృద్ధికోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి కరీంనగర్ గేట్ వేగా ఉంటున్నదని సీఎం అన్నారు. ఫర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్దరణతో పాటు కొత్తగా వస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో 4,300 మెగావాట్లు ఉత్పత్తి చేసే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ గా రామగుండం ఎన్.టి.పి.సి. మారుతుందని అలాంటి రామగుండానికి కూడా కరీంనగర్ ముఖద్వారంగా ఉందని సీఎం అన్నారు. అటవీ అందాలు, ప్రకృతి సౌందర్యాలు, గోదావరి నదిని చూడాలంటే కూడా కరీంనగర్ నుంచే వెళ్లాలని సీఎం చెప్పారు. ఇంతటి ప్రాముఖ్యం, ప్రాధాన్యం కలిగిన కరీంగనర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం వెల్లడించారు. కరీంనగర్ అభివృద్ధి కోసం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ సుందరీకరణకోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 506 కోట్లలో రూ. 25 కోట్లను బుధవారం విడుదల చేశారు. కరీంనగర్ అభివృద్ధిపై ప్రగతి భవన్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీ టి.హరీష్ రావు, శ్రీ ఈటెల రాజెందర్, ఎంపి శ్రీ బి. వినోద్ కుమార్, ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి తుల ఉమ, సాంస్కృతిక సారథి చైర్మన శ్రీ రసమయి బాలకిషన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి. సింగ్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, కలెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ కమీషనర్ శ్రీ శశాంక్, నగర పోలీస్ కమీషనర్ శ్రీ కమలహాసర్ రెడ్డి, సిఎంఓ అధికారులు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కరీంనగర్ నగరాన్ని సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. మంగళవారం మానేరు డ్యామ్, మానేరు రివర్ ఫ్రంట్ ను అందంగా తీర్చిదిద్దడంపై నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి, బుధవారం మరిన్ని నిర్ణయాలు ప్రకటించారు. అవి ఈ విధంగా ఉన్నాయి.
– కరీంనగర్ కు అభివృద్ధి ప్రణాళిక రచించి, అమలు చేసేందుకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. కరీంనగర్ తో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమీషనరేట్లున్న అన్ని పట్టణాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తారు
– నగరంలో ఏఏ రంగంలో పరిస్థితి ఎలా ఉంది? ఏమి చేయాలనే విషయంలో అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ కు ఆదేశం. కరీంనగర్ నగరాన్ని మొత్తంగా మ్యాప్ చేసి, ఎక్కడేమి ఉండాలనే విషయంలో బ్లూ ప్రింట్ తయారు చేయాలి
– 90 కిలోమీటర్ల పొడవుండే మానేరు రివర్ ఫ్రంట్ ను ఉత్తర తెలంగాణకు మణిమకుటంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం. అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్ నగరానికి మరో సుందర ప్రదేశాన్ని జతచేస్తాం. విశాలమైన పచ్చిక బయళ్లు, యోగా కేంద్రాలు, వాటర్ స్పోర్స్ట్ , బోటింగ్ ఏర్పాటు చేస్తాం. నదికి అభిముఖంగా స్వర్గధామంగా ఉండే నివాస గృహాలను నిర్మిస్తాం. మొదటి గృహాన్ని నేను (కేసీఆర్), రెండో గృహాన్ని మంత్రి (ఈటెల రాజెందర్) కొనుగోలు చేస్తారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. దీనికోసం బడ్జెట్లో రూ.506 కోట్లు కేటాయించాం. ప్రాథిమిక పనుల కోసం ఇవాళే రూ.25 కోట్లు విడుదల చేస్తున్నాం. పనులు ప్రారంభించాలని కలెక్టర్ ను ఆదేశిస్తున్నాం. రివర్ ఫ్రంట్ ను మొదట చేగుర్తి లింగాపూర్ వరకు, రెండో దశలో వేగురుపల్లి వరకు సుందరీకరిస్తాం. నదికి ఇరువైపులా అందమైన చెట్లు పెంచాలి. సిల్వర్ ఓక్, పగోడా, మహాగని లాంటి పొడవుగా పెరిగే మొక్కలు నాటాలి.
– పదిన్నర కిలోమీటర్ల పొడవున్న ఎల్ఎండి కట్టపై కూడా విరివిగా చెట్లు పెంచుతాం. డ్యామ్ మీద టూరిస్టు స్పాట్, వ్యూ పాయింట్, రెస్టారెంట్, బోటింగ్ ఏర్పాటు చేస్తాం. కాటేజీలు నిర్మిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.15కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 25 కోట్ల రూపాయలు జత చేసి మొత్తం 40 కోట్ల వ్యయంతో మానేరు డ్యామ్ సుందరీకరణ పనులు చేస్తాం
– కరీంనగర్ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చాలి. మానేరు నుంచి అలుగునూరు బ్రిడ్జి వరకు సర్కారు తుమ్మ చెట్లను, లొట్టపీసు చెట్లను వెంటనే తొలగించాలి. నగరంలో మొత్తం పిచ్చిచెట్లను తొలగించాలి
– నగరంలో పచ్చదనం పెంచేందుకు విరివిగా మొక్కులు పెంచుతాం. స్పెషల్ డ్రైవ్ కింద నగరంలో దాదాపు నాలుగైదు లక్షల మొక్కలు పెంచుతాం. ఈసారి హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కరీంనగర్ లో ప్రారంభిస్తారు. అదే రోజు నగర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటుతారు. దీనికోసం కరీంనగర్ గ్రీన్ బ్రిగేడ్ ను ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయి అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీసు శాఖ కూడా హరితహారం కార్యక్రమంలో భాగంగా కొంత ప్రాంతాన్ని దత్తత తీసుకుని పచ్చదనం కోసం ప్రయత్నిస్తుంది. నగరంలో ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి. లోయర్ మానేర్ డ్యామ్ పైన కూడా మొక్కలు నాటాలి. రిజర్వాయర్ చుట్టూ ఎత్తుగా పెరిగే చెట్లు పెంచాలి. నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం ఐఎఫ్ఎస్ అధికారి వి. ఆంజనేయులను ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నాం. నగరంలో హరితహారం కార్యక్రమానికి రూ.10 కోట్లు ఖర్చు చేస్తాం. పండ్ల చెట్లు, నీడ చెట్లు, పూల చెట్లు, అలంకరణ చెట్లు… అన్నింటిని ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుంది. కరీంనగర్ కు అవసరైన మొక్కలను అటవీశాఖ సిద్ధం చేయాలి. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి ఏ మొక్కలు అవసరమో అభిప్రాయం సేకరించాలి
– కరీంనగర్ హరితహారం కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.10 కోట్లకు అదనంగా తాము కూడా నిధులు ఇస్తామని పలువురు ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చారు. ఎంపి వినోద్ కుమార్ రూ.50 లక్షలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ నారదాసు లక్మ్షణ్ రావు రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి తదితరులు కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఖర్చు చేస్తామని చెప్పారు
– నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నగరంలో మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోట రోడ్ల వెడల్పు కార్యక్రమం నిర్వహించాలి. బస్సులు ఆగే చోట బస్ బేలు నిర్మించాలి. రోడ్లపై బస్సుల నిలిపే పద్దతికి స్వస్తి పలకాలి. దీనివల్ల ట్రాఫిక్ నియంత్రణ సులభమవుతుంది. బస్ బేల నిర్మాణంలో కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలను భాగస్వాములను చేయాలి
– నగరంలో కొత్తగా పోలీస్ కమీషనరేట్ ఏర్పాటు చేసినందున దానికోసం ప్రస్తుత పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా కార్యాలయం నిర్మిస్తాం. హైదరాబాద్ లో నిర్మిస్తున్నట్లే కరీనంగర్ లో కూడా దానికి స్థాయికి తగిన విధంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తాం. నగరంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, పోలీసు కార్యాలయాలు నిర్మించాలి. దీనికోసం అవసరమైన స్థలాలను రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించాలి
– ప్రస్తుతం కలెక్టరేట్ ఉన్న ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్, జిల్లా పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను రీ మోడలింగ్ చేస్తాం. పార్కింగ్, పార్కు తదితర సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతాం. కలెక్టర్ కు అక్కడే క్యాంపు కార్యాలయం కడతాం
– కరీంనగర్ ను ఆనుకుని జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నది. ఇంకా మూడున్నర కిలోమీటర్ల లింక్ జతచేస్తే ఓఆర్ఆర్ ఏర్పాడుతుంది. కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించాలి
– మల్టి పర్పస్ స్కూల్ ప్రాంతంలో విశాలమైన పార్కు నిర్మిస్తాం
– సర్కస్ గ్రౌండ్ ను యధాతధంగా ఉంచి దాని చుట్టూ పెద్ద ఎత్తున చెట్లు పెంచుతాం
– సిటిజన్ క్లబ్ ను యధావిధిగా కొనసాగిస్తాం
– ప్రస్తుతం ఉన్న కళాభారతి ప్రదర్శనలకు అంత అనువుగా లేదు. హెలిప్యాడ్ కోసం వినియోగిస్తున్న పదెకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్ కళాభారతి నిర్మిస్తాం. 500, 1200 మంది సామర్థ్యంతో పట్టే విధంగా రెండు వేర్వేరు హాల్స్ నిర్మిస్తాం
– నగరంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నాలుగు 33/11 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేశాం. వాటి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాలు తొలగించాలి. ఇండ్లపై నుంచి వెళ్లే లైన్లను సరిచేయాలి
– నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలి. గజ్వేల్ లో నిర్మించిన మాదిరిగా ఎసి సౌకర్యంతో పాటు పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో ఈ మార్కెట్లు నిర్వహించాలి. రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించే ఐదు మార్కెట్ల కోసం మార్కెటింగ్ శాఖ రూ.5 కోట్లు, ఎస్డిఎఫ్ నుంచి 20 కోట్లు ఖర్చు చేస్తారు
– నగరంలో నాలుగు చోట్ల ఖనన వాటికలు (బరేల్ గ్రౌండ్స్), మరో నాలుగు చోట్ల దహన వాటికలు (క్రెమెటోరియమ్స్) నిర్మించాలి. దీని కోసం వెంటనే స్థల సేకరణ జరపాలి
– నగరంలో చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తాం. దీనికోసం అనువైన స్థలాలను వెంటనే సేకరించాలి