తెలంగాణ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యం: పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం
తెలంగాణా రాష్ట్ర టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ టూరిజం కేంద్రంగా అభివృద్దిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణా రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
FTAPCCI ఆద్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “తెలంగాణా టూరిజం కంక్లేవ్ 2018” లోగో, బ్రోచర్ ను ఫెడరేషన్ హౌజ్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గౌరా శ్రీనివాస్, గ్లోబల్ పనోరమా షోకేస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్మందీప్ సింగ్, తెలంగాణా టూరిజం కంక్లేవ్ చైర్మన్ హరి కిషన్ వాల్మీకి, FTAPCCI సెక్రెటరీ జనరల్ టి.ఎస్.అప్పారావు, సంచాలకురాలు శ్రీమతి పి. వైదేహి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా FTAPCCI అధ్యక్షులు గౌరా శ్రీనివాస్ మాట్లాడుతూ FTAPCCI , తెలంగాణా టూరిజం మరియు గ్లోబల్ పనోరమా షోకేస్ లు తొలిసారి “తెలంగాణా టూరిజం కంక్లేవ్ 2018” ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్నాయనీ, దీనికి ప్రపంచ దేశాలనుంచి పలు టూరిజం సంస్థలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జూన్ 28 నుంచి జూన్ 30 వరకు 3 రోజులపాటు నిర్వహించనున్న ఈ కంక్లేవ్ లో తొలి రోజు ట్రావెల్ ఎడ్యుకేషన్, ట్రావెల్ బిజినెస్ డెవలప్మెంట్ అంశాలపై సదస్సు జరుగుతుందనీ, 2 మరియు 3 వ రోజులలో బిజినెస్ టు బిజినెస్ సదస్సు, తెలంగాణా టూరిజం తో అంతర్జాతీయ టూరిజం కంపెనీల వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతాయని తెలిపారు.
పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణా భారత దేశంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న టూరిజం ప్రాంతమని పేర్కొన్నారు. దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధిక కోటలు, బురుజులు ఉన్న ప్రాంతమన్నారు. తెలంగాణాను అంతర్జాతీయ విపణిలో ప్రముఖ టూరిజం ప్రాంతంగా గుర్తించే రోజు త్వరలోనే వస్తుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హాంగ్ కాంగ్, సింగపూర్, ప్రాన్స్ తరహాలో తెలంగాణా రాష్ట్రంలో కూడా టూరిజం వాణిజ్యాన్ని అభివృద్దిపరుస్తున్నామన్నారు. అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్శించినప్పుడే టూరిజం వాణిజ్యం సగటున అభివృద్ది చెందుతుందనీ, అంతర్జాతీయ టూరిస్టు ఒక లక్ష రూపాయలను వెచ్చించడానికి ఏమాత్రం వెనుకాడరనీ, అదే డొమెస్టిక్ టూరిస్టు టూరిజం పై అతి తక్కువ మొత్తం వెచ్చిస్తారన్నారు. తెలంగాణా రాష్ట్రం హెరిటేజ్ టూరిజం, ఐ.టీ హబ్, ఫార్మా హబ్, మెడికల్ టూరిజం, అడ్వెంచరస్ టూరిజం ల అభివృద్దిలో ముందుకు వెలుతోందన్నారు.టూరిజం రంగం అభివృద్ది చెందితే మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ లకన్నా కూడా పెద్దయెత్తున ఉద్యోగ కల్పనను అభివృద్ది చేయవచ్చుననీ, తద్వారా 5వ తరగతి చదువుకున్న వారు మొదలుకొని అన్ని రంగాల విద్యావంతులకూ ఉద్యోగ మరియు వాణిజ్యావకాశాలు గణనీయంగా పెంపొందుతాయన్నారు.