- డబుల్ బెడ్ రూం ఇళ్లకు హడ్కో డిజైన్ అవార్డు – 2017
- డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరు కనబర్చినందుకు ప్రశంస
- నాణ్యత,సృజనాత్మకత,పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నందుకు అభినందనలు
హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరును కనబర్చినందుకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు హడ్కో డిజైన్ అవార్డు – 2017 లభించింది. పట్టణ, గ్రామీణ పేదలకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో సృజనాత్మకత, విపత్తులను ఎదుర్కొనేలా పటిష్టమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నందుకు తెలంగాణ హౌజింగ్ కార్పోరేషన్ కు ఈ అవార్డు ఇస్తున్నట్లు హడ్కో ప్రకటించింది. ఢిల్లీలో హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఎప్రిల్ చివరి వారంలో ఈ అవార్డును అందజేయనున్నట్లు హడ్కో తెలిపింది. సిరిసిల్ల,గజ్వేల్, సిద్దిపేట,ఖమ్మం,సూర్యపేటలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను హడ్కో బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించి, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరు కనబరుస్తున్నందుకు ఈ అవార్డు ప్రకటించింది.
మా కృషికి గుర్తింపు వచ్చింది: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు హడ్కో డిజైన్ అవార్డు – 2017 రావడంతో మా కృషికి సరైన గుర్తింపు లభించిందని గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, హౌజింగ్ కార్పోరేషన్ అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలియజేశారు. నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతుకాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకానికి రూపకల్పన చేశారని, దీనికి దేశ వ్యాప్త గుర్తింపు లభిస్తోందనడానికి హడ్కో అవార్డే నిదర్శమన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన నిరుపేదలకు డబుల్ బెడ్
రూం ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రజల నుంచి కూడా అనుహ్యా స్పందన వస్తుండంటంతో…..గూడు లేని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ సర్కారు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లుతుందన్నారు. అలాగే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి సైతం అధికారులకు అభినందనలు తెలిపారు.
నాణ్యత,పాదర్శకతకు పెద్దపీట : ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్ద పీట వేస్తూ, పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో హడ్కో అవార్డు లభించిందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తుండటాన్ని హడ్కో ప్రశంసించిందన్నారు. బహిరంగ మార్కెట్ తో పోలిస్తే టన్నుకు రూ.9440 డబుల్ ఇళ్లకు ఇనుమును విక్రయించేలా స్టీల్ కంపెనీలను ఒప్పించినందుకు కేంద్రం ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు వచ్చాయని ఈ సందర్భంగా చెప్పారు.