టెక్స్టైల్ హబ్గా వరంగల్
-22 సంస్థలతో ఎంవోయూలు
-రూ. 3400 కోట్లతో పెట్టుబడులు
-75 వేలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు
-కాకతీయ మెగాటెక్స్టైల్పార్కు ఎంవోయూ
-కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
టెక్స్టైల్ రంగంలో వరంగల్ను దేశంలోనే అతిపెద్ద హబ్గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్పార్కుకు ఆదివారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడానికి ముందు.. రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండలోని హరితహోటల్లో 22కంపెనీల ప్రతినిధులతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకొన్నది. మంత్రి కే తారకరామారావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, కంపెనీల ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం వారిని మంత్రి కేటీఆర్ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం టెక్స్టైల్రంగంలో ఫ్యాషన్ డిజైన్కు సంబంధించి వస్తున్న మార్పులు, పరిణామాలపై సమగ్ర అధ్యయనం చేసిన తరువాతే వరంగల్లో అతిపెద్ద వస్త్రనగరికి శ్రీకారం చుట్టిందన్నారు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులు, దేశ, విదేశాల్లో వివిధ ప్రాంతాల్లోని కంపెనీల ప్రతినిధులతో చర్చించి.. తొలిరోజే రూ.3400 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఈ ఒక్కరోజు జరిగిన ఒప్పందాలతో ప్రత్యక్షంగా 25వేల ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా సుమారు 50వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. వన్స్టాప్ విజన్ అన్న నినాదంతో నూలుపోగు నుంచి వస్త్రం వరకు అన్నీ ఒకేచోట తయారయ్యేవిధంగా వరంగల్ కాకతీయ మెగాటెక్స్టైల్పార్కును అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నడూలేనివిధంగా టెక్స్టైల్ రంగానికి బడ్జెట్లో రూ.1280కోట్లు కేటాయించారని వివరించారు. రాష్ట్రంలోని గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల, వరంగల్లలో చేనేత పరిశ్రమలకు 50శాతం.. పవర్లూమ్స్పై 10శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులకు చేయూతనివ్వాలన్నదే సీఎం కేసీఆర్ తపన అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పేద ప్రజలకు పంపిణీ చేసే దుస్తులను చేనేత పరిశ్రమల నుంచి కొనుగోలుచేసి, వారికి ఆర్థికసహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రి కేటీఆర్ లోతైన ఆలోచనతో చారిత్రక వరంగల్ నగరంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు రావడం ఒక అద్భుతమని అన్నారు. దేశంలోనే మహోన్నతమైన ప్రాజెక్టు అని అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా వచ్చే వ్యర్థపదార్థాలను బయటికి పంపించేందుకు కంపెనీల ప్రతినిధులు జాగ్రత్తగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. టెక్స్టైల్ పార్కు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన మంత్రి కేటీఆర్కు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.