గ్రామీణాభివృద్ధిలో టి సాట్ ను వినియోగించుకుంటాం
స్థానిక ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతాం
ఖర్చులేకుండా ప్రజల్లోకి వెళ్లేందుకు టి సాట్ ద్వారా అవకాశం
గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రతివారం టి సాట్లో ప్రత్యేక కార్యక్రమాలు
టి సాట్ లో గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాలకు శ్రీకారం
ప్రారంభించిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్- గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టి సాట్ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని… ప్రతి వారం ఒక ప్రత్యేక అంశంపై కార్యక్రమాలను ప్రసారం చేస్తామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తెలంగాణా గ్రామీణాభివృద్ధి సంస్థ రూపొందించిన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని టి సాట్ స్టూడియోలో మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ…సాంకేతిక విప్లవంతో ప్రపంచమే కుగ్రామంగా మారిందన్నారు. టి సాట్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ శాఖ ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి వారం ఒక ప్రత్యేక అంశంపై ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను ప్రసారం చేస్తామన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అవుతున్నా ఇంకా గ్రామాల అభివృద్ధి పెద్దగా జరగకపోవడం బాధాకరమన్నారు. గత మూడున్నరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణుల జీవన స్థితిగతులను మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు.
టి సాట్ ద్వారా ప్రధానంగా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. స్వచ్ఛ భారత్, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, పేదరిక నిర్మూలన, సేంద్రీయ వ్యవసాయం, మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతలాంటి అనేక కార్యక్రమాలపై ప్రతివారం ప్రసారాలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు సెర్ప్ సీఈఓ పౌసమి బసు తెలిపారు. ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు టి సాట్లో గ్రామీణాభివృద్ధిశాఖ కార్యక్రమాలను ప్రసారం చేస్తామని టి సాట్ సీఈఓ శైలేష్రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో స్తీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి , తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సెంటర్ హెడ్ శేషాద్రి పాల్గొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనే అంశంపై స్థానిక సంస్థల ప్రతినిధులు ఫోన్ ద్వారా అడిగిన పలు ప్రశ్నలకు రిసోర్స్ పర్సన్ శంకరయ్య సమాదానాలు ఇచ్చారు.