జీఎస్టీ మార్పులతో ప్రజలకు దీపావళి పండగ ముందే వచ్చేసింది – అభివృద్ధికి అర్ధం మారింది: ప్రధాని మోదీ
అహమ్మదబాద్ అక్టోబర్ 7 : జీఎస్టీ మండలి తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ప్రజలకు దీపావళి పండగ ముందే వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని ద్వారకలోని ఓకా- బెట్ వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.గుజరాత్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని మోదీ విమర్శలు చేశారు. ప్రపంచం వేగంగా మారుతోందని.. దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి భారతీయుడు కలలు కంటున్నాడన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో జీఎస్టీ తీసుకొచ్చిన నూతన మార్పులతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని.. దీని వల్ల దీపావళి పండగ 15 రోజుల ముందే వచ్చినట్లుందని అన్నారు.‘ప్రభుత్వంపై నమ్మకం ఉన్నప్పుడు మంచి విధానాలు అమల్లోకి వస్తాయి.దేశ భవితకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునేప్పుడు ప్రజలు కచ్చితంగా మద్దతిస్తారు. అభివృద్ధి ఫలాలు తమదాకా రావాలని ప్రతి పౌరుడు కోరుకుంటాడు. తమ పిల్లలు పేదరికంలో బతకాలని ఎవరూ అనుకోరు. ప్రజల కలలను సాకారం చేయడమే మా ప్రాధాన్యం.’ అని మోదీ అన్నారు. నౌకశ్రయాలను అభివృద్ధి చేయడం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ కూడా బలపడుతుందని మోదీ అన్నారు.గ్రామాలకు నర్మదా జలాలను విజయవంతంగా రప్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అభివృద్ధికి అర్ధం మారిందని, గతంలో నాయకులు ఒక హ్యాండ్ పంప్ ఏర్పాటు చేసి పలు ఎన్నికల్లో ఆ విషయాన్ని ప్రచారం చేసుకునే వారని, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని చెప్పారు. ప్రజలంతా లబ్ధి పొందేలా నర్మదా జలాలను తాము ఇక్కడికి రప్పించామని చెప్పారు. నర్మదా జలాల వల్ల సురేంద్రనగర్లో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందని అన్నారు. నర్మదా జలాలను ఉపయోగించుకుని బిందు సేద్యాన్ని అమల్లోకి తెస్తామన్నారు. దీంతో 2002 నాటికి వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తథ్యమని అన్నారు. పౌరవిమానయాన విధానాన్ని కొత్తపుంతలు తొక్కించనున్నామని, మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సౌకర్యం కల్పించి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజ్కోట్ విమానాశ్రయం కోసం కేవలం 4 శాతమే వ్యవసాయ భూమిని తీసుకోవడం జరిగిందన్నారు. మిగతాదంతా చవుడు భూములేనని చెప్పారు. రాజ్కోట్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి వచ్చే రోజు కూడా ఎంతో దూరంలో లేదని మోదీ చెప్పారు.