జిల్లా వ్యవసాయ అధికారులతో వివిధ పథకాల అమలు తీరుతెన్నులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్.
14 మార్చి, 2018 న హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పథకాల అమలు తీరుతెన్నుల గురించి సమీక్షించారు.
అందులో భాగంగా రైతు సమన్వయ సమితి సభ్యులకు శిక్షణా కార్యక్రమము గురించి, రైతు వేదికల నిర్మాణము గురించి, సాగుకు పెట్టుబడి పథకానికి సంబంధించి, పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ తో సహా వివిధ పథకాల గురించి వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
ఇప్పటికే రైతు వేదికల నిర్మాణానికై రైతుల నుంచి 17 ఎకరాల భూమి 20 లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయని అన్నారు. రైతుల చొరవ, సహకారం, స్వయంగా పాల్గొనడనమే లక్ష్యంగా రైతు వేదికల నిర్మాణము జరుగుతోందని అన్నారు. రైతులు ముందుకు వచ్చేలాగా అన్నిచోట్ల ప్రోత్సహించాలని వ్యవసాయ కమిషనర్ అన్నారు. రైతుల చొరవతో రైతు వేదికల నిర్మాణము జరగాలనేది మన ముఖ్యమంత్రి ఆకాంక్ష అని గుర్తు చేశారు. మండల స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులకు ఒక బ్యాచ్ కు 85 మంది సభ్యుల చొప్పున అలాగ మొత్తంగా 7 బ్యాచులుగా మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని హైదరాబాదులో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వారికి వ్యవసాయం, మన నేలలు, పంటల బీమా, వ్యవసాయ రుణాలు ఇలా అనేక అంశాలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉపయోగకరంగా ఉండే పాఠ్య ప్రణాళిక అందిస్తారు.
గ్రామ స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యుల ఒక రోజు శిక్షణా కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారులు ఈ నెల 17 కల్లా ప్రణాళిక రూపొందించి తెలియజేయాలని ఆదేశించారు. పంటకు పెట్టుబడి పథకం ఏప్రిల్ 19 నుంచి అమలవుతుందని అన్నారు. అందుకోసం 6 బ్యాంకులను గుర్తించినట్లు చెప్పారు. అలాగే రైతులకు 5 లక్షల రూపాయల బీమా సొకర్యాన్ని కల్పించనున్నట్లు తెలియజేసారు. పంటల బీమా గత ఏడాది నిర్దేశిత లక్ష్యం 40 శాతం కాగా 32 శాతం మాత్రమే చేరుకున్నామని, రైతులు పంటల బీమా చేసుకునే లాగా ప్రోత్సహించాలని కోరారు. నిజామాబాద్ లో ఎర్రజొన్నల కొనుగోలు, రైతులకు చెల్పింపుల్లో ఎటువంటి జాప్యం జరుగకుండా చూసుకోవాలని నిజామాబాద్ డి.ఎ.ఓ. ను కోరారు. ఈ నెల 21 మరియు 22 తేదిల్లో హైదరాబాదులోని సమేతిలో 8 జిల్లాలకు చెందిన ఎంపిక చేసిన్ సన్న, చిన్నకారు రైతులకు అధునాతన వ్యవసాయ యంత్ర పరికరాల క్షేత్రస్థాయి వినియోగం పై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ పథకాలకు సంబంధించి బడ్జెట్ వినియోగంపై స్టేట్ మెంట్ వెంటనే పంపించమని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్పరెన్స్ లో అదనపు వ్యవసాయ సంచాలకులు కె. విజయ కుమార్, సంయుక్త వ్యవసాయ సంచాలకులు బాలు నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.