జలసౌధలో ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, జైకా ప్రాజెక్టులపై మంత్రి హరీశ్రావు సుదీర్ఘ సమీక్ష
వర్షాలకు నెలవైనప్పటికీ పాత ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఏనాడూ లక్ష ఎకరాలకైనా సాగునీరు అందిన దాఖలాలు లేవని, అటువంటి జిల్లా ఇప్పుడు సాగులో నూతన శకాన్ని మొదలుపెట్టిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. గతేడాది ఈ జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో పంటలు పండించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత మూ డేండ్లుగా సాగునీటి పనులను శరవేగంతో పూర్తి చేయిస్తున్నదని, దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయం ముఖచిత్రం మారిపోతున్నదని మంత్రి చెప్పారు. ఈ వేగాన్ని కొనసాగిస్తూ సాగునీరు అందని (గ్యాప్) ఆయకట్టును సైతం సాగులోకి తెచ్చేందుకు నిర్ణీత గడువులోగా పనులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోమవారం జలసౌధలో మంత్రి హరీశ్రావు ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, జైకా ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
పాజెక్టు పనుల పురోగతిని తెలుసుకుని, తదుపరి లక్ష్యాల గురించి అధికారులకు వివరించారు. గతంలో జిల్లాలోని చెరువుల కింద ఉన్న ఆయకట్టులో కేవలం 32 శాతం భూములకు సాగునీరు అందితే, మిషన్ కాకతీయ ప్రారంభమైన తర్వాత అది 90-100 శాతానికి చేరడం విశేషమన్నారు. నాలుగు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న లోయర్ పెనుగంగ ప్రాజెక్టు కలను తెలంగాణ ప్రభు త్వం సాకారం చేసిందని మంత్రి చెప్పారు. మహారాష్ట్రతో ఒప్పందం, 2015లోనే రూ.1227 కోట్లతో పాలనా అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రూ.368 కోట్లతో చేపడుతున్న చనాక-కొరాట బ్యారేజీ పనులను, పంపుహౌజ్, కాల్వల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సదర్మాట్ కాల్వలతోపాటు సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, చెలిమెలవాగు, సరస్వతి కాల్వల ఆధునీకరణ పనులకు ప్రభుత్వం క్యాడ్వాం కింద నిధుల్ని మంజూరు చేసినట్లు తెలిపారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్రావు, చీఫ్ ఇంజినీర్లు భగవంతరావు, శ్యాంసుందర్, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్ పాల్గొన్నారు.
పనుల పురోగతి, లక్ష్యాలపై నివేదిక..
ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతి, మంత్రి హరీశ్రావు నిర్దేశించిన మేరకు లక్ష్యాల సాధనకు రూపొందించిన కార్యాచరణను అధికారులు ఈ సందర్భంగా నివేదిక రూపంలో విడుదల చేశారు. పదేండ్లుగా పెండింగులో ఉన్న 57 చిన్న నీటిపారుదల పథకాలను ప్రభుత్వం పూర్తి చేసి 40వేల ఎకరాలను సాగులోకి తెచ్చిందని, జపాన్ ఆర్థిక సహకారంతో మొదలుపెట్టిన 47 చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో 40 ప్రాజెక్టులను పూర్తి చేసి 39వేల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించిందని పేర్కొన్నారు. గడ్డన్నవాగు ప్రాజెక్టులో 2014 వరకు 0.8 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.21 కోట్లతో పునరావాస పనులు పూర్తి చేసి గత ఏడాది 1.8 టీఎంసీలను ప్రాజెక్టులో నింపింది. గంగనాల ప్రాజెక్టు కింద 4వేల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించారు. మత్తడి వాగు ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద లోగడ 8500 ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరందలేదు. తెలంగాణ సర్కారు ఆ సమస్యను పరిష్కరించడమేగాక అదనంగా 1600 ఎకరాలను సాగులోకి తెచ్చిందని తెలిపారు.ఈ ఖరీఫ్లో 1200 ఎకరాలకు సాగునీరు అందించే పనులు కూడా పూర్తయ్యాయి.