కేసీఆర్ సంకల్పంతోనే సిరిసిల్ల జిల్లా
-11న తొలిసారిగా రానున్న సీఎం కేసీఆర్
-ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలుకాలి
-అపెరల్పార్క్, సమీకృత కలెక్టరేట్కు శంకుస్థాపన
-నేతన్నలకు లేబర్ అండ్ ఓనర్ పథకం
-ఐటీశాఖ మంత్రి కేటీఆర్
కేసీఆర్ సంకల్ప బలంతోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించింది. సీఎం తొలిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికి విజయవంతం చేయాలి అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈనెల 11న సిరిసిల్లకు సీఎం కేసీఆర్ రాకను పురస్కరించుకుని ఆదివారం మంత్రి కేటీఆర్ బైపాస్రోడ్డులోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంతోపాటు సీఎం సభాస్థలి కోసం స్థలాలను పరిశీలించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణను ఎంపిక చేశారు. అనంతరం పొదుపు భవనంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. సీఎం రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని, పట్టణంలో సభ నిర్వహిస్తున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయలుదేరి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారని తెలిపారు. సిద్దిపేటలో వైద్య కళాశాలతోపాటు కలెక్టరేట్కు శంకుస్థాపన చేస్తారని, కేసీఆర్ పర్యటన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొత్త జిల్లాల్లో జిల్లాల ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని కొత్త కలెక్టరేట్లకు సంబంధిత మంత్రులు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ భవన నిర్మాణంతోపాటు, రూ.30 కోట్లతో అపెరల్ పార్కు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా కోనరావుపేట మండలం మల్కపేట మూడు టీఎంసీల రిజర్వాయర్కు శంకుస్థాపన చేస్తారన్నారు. దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి మహిళా కార్మికులు ఉపాధి కోల్పోతున్నందున వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు సిరిసిల్లలో అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కు ద్వారా సుమారు 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు లేబర్ కం ఓనర్ (కార్మికుడే యజమాని) పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు ఇచ్చిన ఘనత సర్కారుదేనన్నారు. గోదావరి జలాలతో ఇంటింటికీ తాగునీటిని డిసెంబర్లో అందిస్తామని పునరుద్ఘాటించారు. కాళేశ్వర ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.
ఏర్పాట్లు భారీగా ఉండాలి..
సీఎం కేసీఆర్ దయవల్ల జిల్లా వచ్చినందున తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ సీఎం సభను దిగ్విజయం చేసేలా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం చారిత్రాత్మక నిర్ణయాల వల్ల నేతన్నలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.