కిడ్నీ వ్యాధి బాధితులకు వర ప్రదాయం డయాలసిస్ కేంద్రాలు
వనపర్తి నవంబర్ 20 : రాష్ట్రంలో మొత్తం 40డయాలసిస్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సింగిల్ యూస్డ్ డయాలసిస్ సెంటర్స్ ని ప్రారంభిస్తున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు. ఇవాళ వనపర్తి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ సెంటర్ ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి బాధితులకు వ్యయ, ప్రయాసలు తగ్గుతాయన్నారు. ఇప్పటికే 5 సెంటర్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. నేడు ప్రారంభించిన వనపర్తి, గద్వాల సెంటర్స్ తో కలిపి 7డయాలసిస్ సెంటర్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. హాస్పిటల్ ఆవరణలో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణాన్ని కూడా మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.