పనుల్లో మరింత వేగం పెంచాలి.
గడువులోగా పనులు పూర్తి చేయాలి.
వర్షాకాలానికి ప్రాజెక్టు సిద్ధం కావాలి.
ఈ నెల 22,23 లలో కాళేశ్వరం పర్యటన.
– మంత్రి హరీశ్ రావు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన పనులలో మరింత వేగం అవసరమని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.ఈ నెల 22, 23 తేదీలలో కాళేశ్వరం పనులను పరిశీలిస్తానని ఆయన తెలియజేశారు.
సోమవారం నాడిక్కడ జలసౌధ లో ఈ ప్రాజెక్టు పనులను సమీక్షించారు.ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఇంకా వేగం పెంచాలని ఆయన కోరారు. మోటార్ల బిగింపు పనులు, గేట్ల తయారీ బిగింపు పనులు కూడా వేగం పుంజుకోవలసి ఉందని మంత్రి అన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తి తెలంగాణ బీడు భూముల్లో పారించాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యాన్ని చేరుకునేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ రేయింబవళ్లు కృషి చేయాలని హరీశ్ రావు కోరారు. ఇంకా నాలుగైదు నెలల గడువు మాత్రమే ఉండడంతో గోదావరిపై నిర్మించే మూడు బరాజ్లు, మూడు పంప్ హౌజ్లతో పాటు కీలకమైన ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ మార్గం పనుల పురోగతిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.