ఓటర్ల జాబితా నుండి ఓటర్ల పేర్లు గల్లంతయినట్లు వచ్చిన వార్తలపై ఖండన
రాష్ట్రంలో ఓటర్ల జాబితానుండి పేర్లు దురుద్దేశపూరితంగా లేదా పొరబాటున తొలంగించి నట్లు కొన్ని వార్తా ప్రసార/ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు తప్పుడు అభిప్రాయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిసింది.
ఈ విషయంలో స్పష్టీకరణ కోసం ఈ వివరణ ఇస్తున్నాం – ఆనవాయితీగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టినప్పుడు పేర్లు తొలగించడం లేదా చేర్చడం అనేది సవరణలో ఒక భాగంగా జరిగే పని. పేర్లను తొలగించడానికి ఏడు రోజుల ముందు ఫారమ్-7ద్వారా నోటీస్ ఇచ్చి సదరు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు ఏవయినా ఉంటే చెప్పుకోవచ్చని తెలియచేయడం జరుగుతుంది. ఒకవేళ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలనుకుంటే ఫారమ్-6 ద్వారా ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇటీవలే ముగిసిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు విస్తృతంగా కృషి చేసిన తరువాతనే వాటిని తాజాగా రూపొందించడం జరిగింది. అనుబంధ జాబితాతో నవంబరు 19వతేదీన వాటిని ప్రచురించడం జరిగింది. తత్ఫలితంగా శాసనసభ ఎన్నికలకు ఉపయోగించిన జాబితా ప్రకారం ఓటర్లు 2,80,64,684 మంది ఉన్నారు. అదే 10.9.2018న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,61,36,776 మంది ఉన్నారు. అంటే దాదాపు 26 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చడం జరిగింది.
వారి పేర్ల తొలగింపుకు సంబంధించి ఒకవేళ ఏవయినా అభ్యంతరాలుంటే వాటి నమోదుకు పౌరులకు మూడు రకాల అవకాశాలు ఇవ్వడం జరిగింది.
- తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్ telangana@gov.in ద్వారా పౌరులు వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేవో సరిచూసుకోవడం
- ఓటర్ల జాబితా అధికారుల నోటీస్ కు స్పందించి నిర్ణీత ఫారం – 7 ద్వారా వారి అభ్యంతరాలను తెలియచేయడం
- అక్టోబరు 26 నుండి నవంబరు 5, 2018 మధ్య విస్తృతంగా చేపట్టిన ‘చెక్ యువర్ ఓట్’ (జాబితాలో మీ ఓటు సరిచూసుకోండి) నినాదంతో చేపట్టిన ప్రచారానికి తగువిధంగా స్పందించడం.
2014లో జరిగిన సాధారణ ఎన్నికలలో తాము ఓటు వేసినప్పటికీ ప్రస్తుత ఓటర్ల జాబితా నుండి తమ పేర్లను తొలగించారని కొందరు ఓటర్లు తెలియచేసారు. జాతీయ ఓటరు సర్వీస్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో కానీ లేదా తమ సమీపంలోని బూత్ స్థాయి అధికారి/ఎన్నికల రిటర్నింగ్ అధికారివద్దకు వెళ్ళి కానీ ఫారమ్ -6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వారికి తెలియ చేయడం జరిగింది. ఓటర్లజాబితాలో వారి పేర్లున్నాయో లేవో సరిచూసుకుని అవసరమయితే మళ్ళీ చేర్పించుకునే బాధ్యత ఓటరుదే. అంతకుముందు ఎన్నికలలో ఓటు వేసినంత మాత్రాన తరువాత ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత కాజాలదు.
త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నందువల్ల ఓటర్ల జాబితాలో వారి పేర్లు చేర్పించుకోవాలని మరోసారి ఎన్నికల సంఘం కోరుతున్నది. జనవరి 1, 2019 నుండి తాజా ఓటర్ల జాబితా తయారీ నన్నాహాలు మొదలవుతున్నందువల్ల డిసెంబరు 26, 2018 నుండి తాజా సవరణలను రాష్ట్ర ఎన్నికల కార్యాలయం విస్తృతంగా చేపడుతున్నది.