- ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు సమిష్టిగా పనిచేద్దాం
- ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం పరస్పర నమ్మకంతో కలిసుందాం
- అక్షరాస్యతలో వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పనిచేయాలి
- బడిమనదనే దృక్పథాన్ని ఉపాధ్యాయుల్లో పెంచాల్సిన బాధ్యత సంఘాలదే
- పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి
- ఏజన్సీ ప్రాంతాల్లో ఒకరిద్దరున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం మీరే పెంచాలి
- ఏప్రిల్ మాసంలో విద్యా రంగ సమస్యలపై పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తాను
- ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
- ఉపాధ్యాయ సంఘాలతో ఈ సమావేశం మంచి పరిణామం
- అక్షరాస్యత పెంపునకు, హాజరు శాతం పెంచేందుకు, పదో తరగతి ఉత్తమ ఫలితాలకు పూర్తిగా సహకరిస్తాం
- బడులు మనవనే ధోరణితో పనిచేసేందుకు అందరం సిద్ధంగా ఉన్నాము
- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఉపాధ్యాయ సంఘాల హామీ…సమస్యల వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 17 : పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలబడుతూ దూసుకెళ్తుండగా….అక్షరాస్యతలో మాత్రం వెనుకబడి ఉండడం దురదృష్టకరమని, ఈ పరిస్థితిని మార్చేందుకు, అక్షరాస్యతలో కూడా రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు, ఏజన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని మెరుగుపర్చేందుకు, రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మొత్తంగా ప్రభుత్వ బడులను మన బడులుగా భావించి సామాజిక బాధ్యతతో ఉపాధ్యాయులు పనిచేయాలనే ఉద్దేశ్యంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘాల జేఏసీల ప్రతినిధులంతా హాజరై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దూసుకెళ్తూ నెంబర్ వన్ స్థానంలో ఉంటున్న సందర్భంలో అక్షరాస్యతలో మాత్రం చాలా వెనుకబడి ఉందని, జాతీయ సగటు 77 శాతం ఉండగా, రాష్ట్ర సగటు 66 శాతం మాత్రమే ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ పరిస్థితిని మార్చాలని 66 శాతం నుంచి ఈ ఏడాది కనీసం 80 శాతానికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పనిచేయాలని కోరారు. అదేవిధంగా ఏజన్సీ ప్రాంతాల్లో దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ఒకరిద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో హాజరు శాతం సరిగా ఉండడం లేదని, దీనిని మెరుగుపర్చేందుకు తగిన సూచనలివ్వాలని, సంఘాలుగా బాధ్యత తీసుకుని పనిచేయాలని కోరారు. మరో 25 రోజుల్లో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చేందుకు సమిష్టిగా పనిచేయాలన్నారు. ఇప్పటికే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ తరగతులు నిర్వహిస్తూ, ఉపాధ్యాయులే తమ సొంతంగా కొన్ని చోట్ల విద్యార్థులకు స్నాక్స్ ఇస్తూ ప్రోత్సహించడాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. చాలామంది ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారని, అయితే కొంతమంది సరిగా పనిచేయకపోవడం వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత సంఘాలపైనే ఉందన్నారు. విద్యాశాఖకు చెడ్డపేరు తీసుకొచ్చే ఉపాధ్యాయులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా సంఘ పరంగా చర్యలు తీసుకుంటే మంచిదని సూచించారు. మొత్తంగా ప్రభుత్వ బడులను మన బడులుగా భావించే దృక్పథాన్ని ఉపాధ్యాయుల్లో పెంచాలని, ఈ రకమైన స్పూర్తిని ఉపాధ్యాయ సంఘాలు పెంచాలని విజ్ణప్తి చేశారు.
ఉపాధ్యాయులు, విద్యాశాఖలోని సమస్యలపై పదో తరగతి పరీక్షల తర్వాత ఏప్రిల్ మాసంలో పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ఈలోపు ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించే అంశాలన్నింటిని పూర్తి చేస్తామన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించడంలో, పేపర్లను దిద్దడంలో ఉపాధ్యాయ సంఘాల సహకారం కావాలన్నారు. అకాడమిక్ క్యాలెండర్ పై రానున్న విద్యా సంవత్సరానికి ముందుగానే సమావేశం పెట్టుకుని చర్చించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏకీకృత సర్వీసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రిగా తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, వీలైనంత త్వరలో దీనిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదికానీ పక్షంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ప్రత్యామ్నాయాలను కూడా అమలుచేసే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఉందన్నారు.
పేదలు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ బడులను విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని సామాజిక బాధ్యతగా ఉపాధ్యాయులంతా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుని, పటిష్టం చేసేందుకు తాను చిత్తశుద్దితో ఉన్నానని చెప్పారు.
ప్రభుత్వ బడుల్లోని ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు చేయించి, వారికి ఆరోగ్య కార్డులు అందించాలని ఆలోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాల నేతలతో తెలిపారు. ఈ విషయంలో ఉపాధ్యాయుల సహకారం పూర్తి స్థాయిలో కావాలని కోరారు.
ఉపాధ్యాయ సంఘాల నేతలను పిలిచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ సమావేశం పెట్టడం మంచి పరిణామమని, తమకెంతో సంతోషాన్ని ఇస్తోందని ఉపాధ్యాయ సంఘం నేతలు అన్నారు. ఇదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సమావేశం పెడుతానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇవ్వడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ఈ సమావేశం ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ప్రతీకగా అభివర్ణించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వారి తమ ముందుంచిన నాలుగు సమస్యలపై పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. అక్షరాస్యతను పెంపొందించడం తమ బాధ్యతగా పనిచేస్తామన్నారు. హాజరు శాతం పెంచడంతో ఎం.ఈ.ఓల పర్యవేక్షణ పకడ్బందీగా చేయాలని కోరారు. ఉపాధ్యాయులు ఎవరైనా నిర్లక్ష్య ధోరణితో బడికి హాజరు కాకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకునేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లో అడ్డు చెప్పమని హామీ ఇచ్చారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేందుకు చాలా మంది ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని, సొంత ఖర్చులతో స్నాక్స్ అందిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించి ఉపాధ్యాయులను అభినందించినందుకు ఉప ముఖ్యమంత్రికి ఉపాధ్యాయ సంఘాల నేతలు కృతజ్ణతలు తెలిపారు. తమ సమస్యలను ఎత్తి చూపడమే కాకుండా, తాము చేసిన మంచి పనులను కూడా గుర్తించే మంత్రిగారు మాకుండడం అదృష్టమని కొనియాడారు. ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే పలు ఉత్తర్వులు ఇటీవల విద్యా శాఖలో వచ్చాయని, అయితే వాటిని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఉపసంహరించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్సష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా సీసీఈ విధానాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పారన్నారు. గతంలో అనుసరించిన పలు ఉత్తమ విధానాలు మళ్లీ అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఉపాధ్యాయుల సంఘం జేఏసీల నేతలు సర్వోత్తమరెడ్డి, భుజంగరావు, రవి, పిఈటీల అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వరరావు, హెడ్ మాస్టర్ల సంఘం అధ్యక్షుడు ఆడమ్స్, ఇతర ప్రతినిధులు, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు కిషన్, ఆయా విభాగాల డైరెక్టర్లు పాల్గొన్నారు.