ఉచిత డయాలసిస్ పేదలకు వరం
-మరో రెండుకేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
-ఇప్పటికే 10 కేంద్రాల్లో సేవలు
-నెలరోజుల్లో మరో 29 దవాఖానాల్లో
-39 హాస్పిటల్స్లో 73 యూనిట్లు
-కేసీఆర్ కిట్స్ పథకంలో డాక్టర్లకు రూ.500 ప్రోత్సాహకం
నిరుపేద కుటుంబాలకు చెందిన కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉచిత డయాలసిస్ కేంద్రాలు వరం లాంటివని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని మలక్పేట, వనస్థలిపురంలో ఉచిత డయాలసిస్ యూనిట్లను, మంచినీటి ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని 39 సర్కారు దవాఖానాల్లో 73 డయాలసిస్ యూనిట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించి, 10 కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. మిగిలిన కేంద్రాల్లో నెలరోజుల్లో ఉచిత డయాలసిస్ కేంద్రాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రత్యేక కార్యక్రమాలను, కేసీఆర్ కిట్స్ వంటి అద్భుత పథకాలను అమలుచేస్తున్నామని గుర్తుచేశారు. కిడ్నీ సమస్యల నుంచి పేదలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి హర్షణీయమని అన్నారు. అంతర్జాతీయస్థాయి పరికరాలతోపాటు దేశంలోనే మొదటిసారి సింగిల్ యూజ్డ్ డయాలసిస్ ఫిల్టర్లను సర్కారు దవాఖానల్లో వినియోగిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందని పేర్కొన్నారు.
డాక్టర్లకు కూడా కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. కేసీఆర్ కిట్ల పథకంలో ప్రతి ప్రసూతికి కేటాయించిన రూ.1500 ప్రోత్సాహకంలో డాక్టర్కు రూ.500, ప్రసూతికి సహకరించే సిబ్బందికి రూ.500, దవాఖానకు రూ.500 చొప్పున అందజేస్తామన్నారు. దీనిద్వారా దవాఖానా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అందరికంటే మనకే సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించి, వైద్యులు, సిబ్బంది మానవీయ దృక్పథంతో పనిచేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సం క్షేమశాఖలో త్వరలోనే ఖాళీల భర్తీ చేపడుతామని, వైద్య విధాన పరిషత్ పరిధిలో 4వేల పోస్టుల భర్తీ ప్రక్రియను రెండునెలల్లో పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.
ప్రతిరోజూ 580 మందికి డయాలసిస్
39 సర్కార్ దవాఖానల్లో 73 ఉచిత డయాలసిస్ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. మంగళవారం మలక్పేట, వనస్థలిపురంలో ప్రారంభించినవాటితో కలిపి, పది దవాఖానల్లో ఉచిత డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. నిమ్స్, నిజామాబాద్, గాంధీ, ఉస్మానియా, మహబూబ్నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, సంగారెడ్డిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 29 కేంద్రాల్లో నెల రోజుల్లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ రిమ్స్, ఉట్నూరు, తాండూరు, వికారాబాద్, మహేశ్వరం, మెదక్, జహీరాబాద్, గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, ఏటూరునాగారం, మహబూబాబాద్, జనగామ, నర్సంపేట, వరంగల్ ఎంజీఎం, కరీంనగర్, జగిత్యాల, గోదావరిఖని, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్నగర్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్లో ఉచిత డయాలసిస్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
కిడ్నీ సమస్యలున్నవారు వారానికి రెండు, మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. కిడ్నీ బాధితులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమీప సర్కారీ దవాఖానలోనే ఉచిత డయాలసిస్ సేవలు పొందేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. వీటిద్వారా ప్రతిరోజూ 580 మంది కిడ్నీ బాధితులకు ఉచితంగా డయాలసిస్ చేసే అవకాశం లభిస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచితంగా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ పద్ధతిలో ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ చేస్తుండటం విశేషం. సాధారణంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో డయాలసిస్కు వినియోగించే ఫిల్టర్ను శుభ్రంచేసి మళ్లీమళ్లీ దానినే ఇతర పేషెంట్లకు వాడుతున్నారు. ఆ విధానం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతివ్యక్తికీ కొత్త ఫిల్టర్ వినియోగించేలా చర్యలు తీసుకున్నది.