ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ ను ప్రారంబించిన చలనచిత్ర అభివృద్ధి సంస్ధ
హైదరాబాద్ అక్టోబర్ 7 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ షూటింగ్ ల కోసం సింగిల్ విండో అనుమతులు అందించే ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించుకోవడం నిర్మాతలకు, ప్రేక్షకులకు థియేటర్ యజమానులకు ఎంతో ఉపయోగకరమని రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.శనివారం సచివాలయంలో ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్, సింగిల్ విండో అనుమతుల విధానాన్ని మంత్రి ప్రారంభించారు..రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ మంత్రులతో సబ్ కమిటి వేసిందని, వారికి ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు, చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం 5 వ ఆట ప్రదర్శన కు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, 2 లేదా 3 రోజులలో ఇందుకు సంబంధించిన జివో ను జారీ చేయనున్నామని తెలిపారు.
సినిమా షూటింగ్ కోసం వివిధ శాఖల నుండి అనుమతుల కోసం నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టి.ఎస్.ఎఫ్ డిసికి ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకుంటే 7 రోజుల లోపు అన్ని అనుమతులు మంజూరు అవుతాయని అన్నారు. 7 రోజుల లోపు అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చన్నారు. అంతర్జాతీయ స్ధాయిలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధించి స్ధలం ఎంపిక కోసం దీపావళి తరువాత పర్యటిస్తామన్నారు. ఆర్.టిసి, బస్ స్టాండ్లలో మినీ ధియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని వివరించారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం తో టికెట్ల ధర, విక్రయాలు ఎన్ని చేసింది పారదర్శక సమాచారం తెలుసుకోవచ్చాన్నారు. ప్రపంచంలో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా చాటిన బాహుబలి చిత్రం మనదే కావడం ఎంతో గర్వకారణం అన్నారు. లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సినీ అవార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు డా.కె.వి రమణాచారి అధ్యక్షతన కమిటీ సమావేశమయ్యిందని, గైడ్ లైన్స్ తయారు చేసి, ముఖ్యమంత్రి గారి అనుమతితో నిర్వహిస్తామన్నారు.ప్రభుత్వ సలహాదారు డా.కె.వి రమణాచారి మాట్లాడుతూ రెండు మంచి
కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించడం అభినందనీయమని, ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని, ఆదాయ విషయంలో స్పష్టత ఉంటుందన్నారు. ఫిలిం ఇనిస్టిట్యూట్ ద్వారా సినీ విభాగాల్లో ఎంతో మంది శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఎఫ్ డి సి ఛైర్మన్ రాంమోహన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. చిత్ర పరిశ్రమలో సీనయర్ల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతామన్నారు.ఎఫ్ డిసి ఎం.డి శ్రీ నవీన్ మిత్తల్ మాట్లాడుతూ దేశంలో అత్యుత్తమమైన విధానాన్ని ప్రారంభిస్తున్నామని, అటు ప్రేక్షకులకు, నిర్మాతలకు ఆన్ లైన్ పోర్టల్ విధానం ఉపయోగపడుతుందన్నారు. టి.ఎస్ ఐపాస్ తరహాలోనే ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ ను ప్రారంభించామని, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆన్ లైన్ అనుమతులకు సంబంధించి ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారి ఉంటారని వీరందరు 7 రోజులలో ఆన్ లైన్ అనుమతులు ఇస్తారన్నారు. అనుమతి ఇవ్వని పక్షంలో అనుమతులు ఇచ్చినట్లు గానే పరిగణించి సినిమా షూటింగ్ లు ప్రారంభించుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డా.కె.వి రమణాచారి, టి.ఎస్.ఎఫ్ డిసి ఛైర్మన్ రాంమోహన్ రావు, ఎఫ్ డిసి ఎం.డి నవీన్ మిత్తల్, జె.ఎం.డి శ్రీ కిషోర్ బాబు, హైదరాబాద్ అడిషనల్ కమీషనర్ టి.మురళీ కృష్ణ, సైబరాబాద్ జాయింట్ కమీషనర్, షాన్ వాజ్ ఖాసిమ్, సినీ ప్రముఖులు దిల్ రాజ్, పాల్గొన్నారు