ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పంచాయతీ చట్టం.
ఉమ్మడి మేదక్ జిల్లాలో 3 వేల ఎకరాల భూ పంపిణీ.
మిషన్ భగీరథపై స్పెషల్ డ్రైవ్.
డబుల్ బెడ్ రూమ్,భగీరథపై ప్రతి వారం సమీక్ష.
2014 వరకు చేనేత రుణాలు మాఫీ.
మున్సిపాలిటీలుగా నర్సాపూర్, నారాయణఖేడ్,తూప్రాన్,రామాయంపేట,చేర్యాల.
కొత్త మునిసిపాలిటీలకు స్టార్టప్ నిధులు.
ప్రతి మునిసిపాలిటీలో వైకుంఠ ధామం, రైతుబజార్.
ఈ నెలాఖరులోపు ఎం.ఎల్.ఏ.అభివృద్ధి నిధుల ఖర్చు.
– మంత్రి హరీశ్ రావు.
జిల్లాకు వెయ్యి ఎకరాల చొప్పున సిద్ధిపేట,మేదక్, సంగారెడ్డి జిల్లాల్లో 3 వేల ఎకరాలను దళితులకు పంపిణీ చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. గురువారం అసెంబ్లీ హాలులో ఉమ్మడి మేదక్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. జిల్లాకు 1000 ఎకరాల చొప్పున 3000 ఎకరాలు దళితులకు భూపంపిణీ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని హరీశ్ రావు కోరారు.శాసన సభ్యులు ప్రతిపాదించిన భూమికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.అయితే దళితుల భూపంపిణీ కార్యక్రమంలో విమర్శలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని మూడు జిల్లాల కలెక్టర్లు, శాసనసభ్యులు, అధికారులను మంత్రి కోరారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సాగుకు యోగ్యమైన భూములనే మూడు ఎకరాల చొప్పున దళితులకు పంపిణీ చేయాలని హరీశ్ రావు ఆదేశించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా నర్సాపూర్, నారాయణఖేడ్, తూప్రాన్, రామాయంపేట, చేర్యాల మునిసిపాలిటీలుగా ఏర్పడబోతున్నట్టు మంత్రి తెలియజేశారు.కొత్తగా ఏర్పాటయ్యే మునిసిపాలిటీలకు స్టార్ట్ అప్ నిధులున్నాయని వాటితో అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి కోరారు.ఏ గ్రామ పంచాయతీ లో ఏ గ్రామాలను,ఏ మునిసిపాలిటీలో ఏ గ్రామ పంచాయతీలను విలీనం చేస్తున్నారో రెండు రోజుల్లో తెలియజేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లనూ మంత్రి కోరారు పక్కాగా పారదర్శకంగా ఈ పనులు చేయాలని, విలీనం సందర్భంగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూడాలన్నారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే గ్రామ పచాయతీ చట్ట సవరణ బిల్లును ఆమోదించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు హరీశ్ రావు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏ.సి.డి.పి.)నిధులను వెంటనే ఖర్చు చేయాలని మంత్రి ఆదేశించారు. పలు నియోజకవర్గాల్లో ఈ నిధులు ఖర్చు కావడంలేదని, దీంతో ప్రజల్లో సంబంధిత స్థానిక శాసన సభ్యులపై అసంతృప్తి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.ఈ నెలాఖరు లోపు ఏ.సి.డి.పి. కింద ఉన్న నిధులు ఖర్చు పెట్టె విధంగా పనులు మంజూరు చేసి వాటిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఏం.ఎల్.ఏ.లను హరీశ్ రావు కోరారు. ప్రతి పురపాలకసంఘానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించి అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. మునిసిపల్ చైర్మన్లు, కమిషనర్లు తెల్లావారుఝామునే పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని మంత్రి కోరారు.ప్రతి మునిసిపాలిటీలో ఒక రైతుబజార్ ను మంజూరు చేశామని అయితే నాలుగైదు చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని,కొన్ని చోట్ల అసలు పనులే మొదలుపెట్టలేదని ఆయన అన్నారు. సత్వరం రైతుబజార్ ల నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రతి మునిసిపాలిటీలోనూ వైకుంఠధామమ్ ఏర్పాటు చేయాలని ఇందుకు గాను స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ఇతర మార్గాలలో నిధులు సమకూర్చుకొని వాటిని తీర్చిదిద్దాలని హరీశ్ రావు సూచించారు. వైకుంఠ రధాన్ని అందుబాటులో ఉంచాలని మంత్రి కోరారు.సిద్ధిపేటలోని వైకుంఠధామం ను మోడల్ గా తీసుకొని నిర్మించాలని కోరారు. వచ్చే ఆరు నెలల్లోపు మునిసిపాలిటీల రూపురేఖలు పూర్తిగా మారిపోవాలని మంత్రి కోరారు. అన్నీ మున్సిపాలిటీలలో ఎల్.ఈ.డి.లైట్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా 12 దేవాలయాలకు పాలక మండలి ఏర్పాటు కాలేదని వెంటనే ఆయా కమిటీలను నియమించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.మూడు జిల్లాల్లో మహిళాభవనాలు గ్రామాల్లో కొత్తగా మహిళా భవనాలు నిర్మించాలని మంత్రి ఆదేశించారు.మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి కేంద్రీకరించారని మంత్రి హరీష్ రావు తెలిపారు.ఉమ్మడి మేదక్ జిల్లాలో మిషన్ భగీరథ కార్యక్రమం పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిరవహించనున్నట్టు చెప్పారు. ఆర్.డబ్ల్యూ.ఎస్.అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు.మూడు జిల్లాల్లో డబుల్ రూమ్ ల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు.ఇసుక కొరత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్, మిషన్ భగీరధ పనులను ప్రతివారం ఒక రోజు ప్రత్యేకంగా సమీక్షించాలని ఆయన కోరారు. మూడు జిల్లాల్లో చేనేత కార్మికుల ఋణ మాఫీ ని హరీష్ రావు సమీక్షించారు. ఇదివరకు 2011 వరకు మాత్రమే చేనేత కార్మికులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని తెలిపారు.2014 వరకు ఉన్న చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినందున లబ్ధిదారుల జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మ, శాసన సభ్యులు బాబూమోహన్,మదన్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,భూపాల్ రెడ్డి, చింత ప్రభాకర్, రామలింగారెడ్డి ,ఎల్.సి.లు ఫరీదుద్దీన్,భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్లు వెంకటరామిరెడ్డి, వెంకటేశ్వర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.