అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాంకు ఘనంగా వీడ్కోలు
హైదరాబాద్ సెప్టెంబర్ 8 (ఎక్స్ ప్రెస్ న్యూస్): అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాంకు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్తో పాటు పలువురు మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వీడ్కోలు సభలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రులు హరీష్రావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్ బిజేఎల్పి నేత జి.కిషన్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
శాసనసభకు సదారాం సుదీర్ఘంగా చేసిన సేవలు చిరస్మరణీయమని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. సభ నడుస్తున్న తీరుపై విపక్ష నేతల ప్రశంసలు ఆనందాన్నిస్తున్నాయని తెలిపారు. సభ ఇంత చక్కగా నడవడానికి కారణం సదారాం అని చెప్పక తప్పదన్నారు. సదారాం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని స్పీకర్ సూచించారు.
మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ సదారాం, నరసింహాచార్యుల అనుభవాలు మండలి సజావుగా జరిగేందుకు కారణమయ్యాయని చెప్పారు. సభల్లో అలజడులు, ప్రశాంతతలు చూసిన అనుభవం సదారామ్ది అని తెలిపారు. తెలంగాణ చట్టసభల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా ఉండటం గర్వకారణమన్నారు. సభల నిర్వహణ సజావుగా సాగేందుకు అందరూ సహకరిస్తున్నారని తెలిపారు. ఇక ముందు కూడా సహకరించాలని స్వామిగౌడ్ కోరారు .
రాజా సదారాం సేవలు రాష్ర్టానికి ఉపయోగపడాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి చెప్పారు. సదారాం మంచి సమన్వయ కర్త అని కొనియాడారు. గత మూడేళ్లుగా తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవడానికి సదారాం గణనీయమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.
మంత్రిహరీష్రావు మాట్లాడుతూ 42 ఏళ్ల పాటు శాసనసభతో రాజాసదారాం అవినాభావ సంబంధం ఏర్పరుచుకున్నారని పేర్కొన్నారు. సదారాం ప్రొఫెసర్ జయశంకర్సార్ శిష్యుడు అని తెలిపారు. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందోనని భయపడినమని గుర్తు చేశారు. అయితే జయశంకర్సార్ శిష్యుడిగా సదారామ్పై తమకు నమ్మకం ఉండేదన్నారు. తెలంగాణ బిల్లు సమయంలో ఆయన క్లిష్టతరమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. నలుగురు సీఎంల దగ్గర పని చేయడమే కాకుండా వారి మన్ననలు పొందిన వ్యక్తి రాజా సదారాం అని పేర్కొన్నారు. సదారాం సేవలను కచ్చితంగా ప్రభుత్వం వినియోగించుకుంటుందని మంత్రి హరీష్రావు స్పష్టంచేశారు. తెలంగాణ శాసనసభను బాగా నడపడానికి కృషి చేసిన రాజా సదారాంకు ధన్యవాదాలు తెలిపారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. కొత్త కార్యదర్శి నరసింహాచార్యులు కూడా బాగా పని చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.