అన్ని పదవులకూ వన్నె తెచ్చిన వెంకయ్య
సొంత రాష్ట్రమైన ఏపీకి ఎంతో చేశారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి ఆగష్టు 26(ఎక్స్ ప్రెస్ న్యూస్): ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు తన రాజకీయ జీవితంలో సొంత రాష్ట్రమైన ఏపీకి ఎంతో చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను అలంకరించిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారని కొనియాడారు. క్రమశిక్షణకు, సేవా భావానికి మారుపేరుగా నిలిచారని చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, సభాపతి కోడెల శివప్రసాదరావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో పుట్టి మొట్టమొదటి ఉప రాష్ట్రపతి అయిన వ్యక్తి వెంకయ్య అని చంద్రబాబు కొనియాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి అన్నారు. తామిద్దరమూ 1978లోనే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని చెప్పారు. మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచే ప్రజా సమస్యలపై పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా, రాజస్థాన్ నుంచి ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా, భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఇలా ఎన్నో పదువులు అలంకరించారని చెప్పారు.విభజన సందర్భంలో ఏపీ తరఫున నిలబడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు. దేశ వ్యాప్తంగా పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 26 లక్షల ఇళ్లను ఇస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్కే 5.29లక్షల ఇళ్లను మంజూరుకు చొరవ చూపారని చెప్పారు. ఉప రాష్ట్రపతి అయ్యే ముందు కూడా రాష్ట్రానికి 2.25లక్షల ఇళ్లను మంజూరుకు సంతకం చేశారని చెప్పారు. ఆయన నేతృత్వంలోనే రాష్ట్రానికి మూడు స్మార్ట్ సిటీలు వచ్చాయని చెప్పారు.ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగులో ఏ విధంగా మాట్లడతారో హిందీలోనూ, ఆంగ్లంలోనూ అదే స్థాయిలో అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి అని కొనియాడారు. ఎప్పుడూ సమయపాలన పాటించేవారని చెప్పారు. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలందిస్తున్నారని అన్నారు. తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తికి అమరావతిలో సన్మానించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్య అని కొనియాడారు.