అద్భుతమైన ప్రాజెక్ట్ గా అంబెడ్కర్ విగ్రహ స్థాపన
ఆర్కిటెక్ కన్సల్టెంట్ కు మంత్రి జగదీష్ రెడ్డి సూచన
సచివాలయంలో సమావేశమైన విగ్రహాకమిటీ
హైదరాబాద్ ఆగష్టు 18(ఎక్స్ ప్రెస్ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన అంబెడ్కర్ విగ్రహ స్థాపన యావత్ భారతదేశానికే తలమానికంగా ఉండేలా తీర్చి దిద్దాలని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ది శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అంబెడ్కర్ విగ్రహ స్థాపన తెలంగాణ రాష్ట్రానికి ఓ రోల్ మోడల్ కావాలని ఆయన ఆకాంక్షించారు. భారతరాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నెక్లేస్ రోడ్ సమీపంలో 125 అడుగుల ఎత్తులో అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే అంత ఎత్తయిన విగ్రహ ఏర్పాట్లు నిమిత్తం ప్రభుత్వం నియమించిన అంబెడ్కర్ విగ్రహాకమిటీ ఛైనా,సిక్కిం తదితర ప్రాంతాలలో పర్యటించి అక్కడ నెలకొల్పిన విగ్రహాలను పరిశీలించిన విషయం తెలిసిందే. అందుకు అనువుగా పలుసార్లు నిపుణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబెడ్కర్ విగ్రహాఏర్పాట్ల నమూనాలను పరిశీలించి ఓ నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లోని నోయిడా ప్రాంతానికి చెందిన డిజేయిన్ స్టూడియో అసోసియేట్స్ ముందుకు వచ్చి కొన్ని నమూనాలను సిద్దం చేశారు. అందులో భాగంగా శుక్రవారం రోజున మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన విగ్రహా కమిటీ సభ్యులు డిజెయిన్ స్టూడియో రూపొందించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. నమూనాలను పరిశీలించిన మీదట కొన్ని మార్పులు చేర్పులు చెయ్యడంతో పాటు అంతిమంగా ఎలా ఉండాలి ఎంత స్థలంలో నిర్మించాలి వంటి అంశాలపై చర్చించి తదుపరి సమావేశంనాటికి కొలిక్కి వచ్చేలా చూడాలని మంత్రి జగదీష్ రెడ్డి డిజేయిన్ అసోసియేట్స్ సభ్యులతో పాటు అధికారులను ఆదేశించారు.
ఇంకా ఈ కార్యక్రమములో బుద్ధవనం అభివృద్ధి చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ,శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్,వేముల వీరేశం,యస్.సి అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లుభవనాలశాఖా ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, యస్..సి అభివృద్ధి శాఖా డైరెక్టర్ కరుణాకర్,జె.ఎన్.టి.యు శిల్పి శ్రీనివాస రెడ్డి లతో పాటు ఢిల్లీకి చెందిన డిజెయిన్ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.