వరంగల్: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని కేంద్రమే ఒప్పుకుందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ ఆయన స్పూర్తితో ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుకెళ్తున్నారని చెప్పారు.
అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ములుగులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆశిష్కరించి, అక్కడి డిగ్రీ, జూనియర్ కాలేజీలలో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… ఆరు దశాబ్దాల పోరాటం, ఉద్యమ నాయకుడుగా కేసిఆర్ నాయకత్వం, అమరుల త్యాగాల ఫలితం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. అయితే కొంతమంది ఇటీవల బస్సు, సైకిల్ యాత్రలు చేస్తుండడం చూస్తే జాలి వేస్తోందన్నారు. నిమ్న వర్గాలు కూడా అందరితో సమానంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతోనే నాడు అంబేద్కర్ మహానీయుడు రిజర్వేషన్లు పెట్టారన్నారు. అదేవిధంగా రాజ్యాంగం రాసి నేటికి 68 ఏళ్లు అవుతుందని, 68 ఏళ్లక్రితమే రాష్ట్రాల పునర్విభజన, సరిహద్దుల నిర్ణయం పార్లమెంట్ కు ఉండాలని ఆలోచించిన దూరదృష్టి కల మేథావి అంబేద్కర్ అని కొనియాడారు. అందుకే ఐక్యరాజ్యసమితి కూడా ఆయనను ప్రపంచ మేథావిగా గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా అక్కడ నిర్వహిస్తుండడం దళితులందరికీ గర్వకారణమన్నారు. నేడు అంబేద్కర్ జయంతి ప్రపంచ దేశాలలో గొప్పగా జరుగుతోందని, దళితులు పండగలా చేసుకుంటున్నారని చెప్పారు.
ములుగులో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి నిరంతర కృష్టి వల్లే అభివృద్ధి సాధ్యమవుతోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. జూనియర్ కాలేజీ ఆవరణలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాత భవనాలన్ని కూల్చి కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపితే రెండు కోట్ల రూపాయలు అయినా మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఆజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.