హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు (61) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదు స్వగృహంలో సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
విజయవాడలో జన్మించిన హనుమంతరావు 18 ఏళ్ల వయసులో నాటకాల్లోకి ప్రవేశించారు. తర్వాత స్టేజి షోలతో బాగా పాప్యులర్ అయ్యారు. ‘సత్యాగ్రహం’ సినిమాతో చిత్రపరిశ్రమలో కాలుమోపారు. మొత్తం 400 సినిమాల్లో నటించారు. అమృతం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు.
ఆయనకు ఓ కుమారుడు ఉన్నారు. బాబాయి హోటల్, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, సత్యం, పెళ్లాం ఊరెళితే, అతడు, భద్ర, ఆట, మస్కా.. తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
హనుమంతరావు మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంత రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మంతరావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ, రంగస్థలాలో తన నటన ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హన్మంతరావు మరణం తీరని లోటు అని సీఎం అభిప్రాయపడ్డారు.