తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య 93వ జయంతి వేడుకలు
ఈ రోజు రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య 93 వ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని సగర్వంగా ప్రకటించి తనదైన శైలిలో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహా కవి దాశరథి.
ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ శాసనసభ సభాపతి సిరికొండ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డా. కె.వి. రమణచారీ, సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిదారెడ్డి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు, గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ అయాచితం శ్రీధర్, దాశరథి కుమారుడు లక్ష్మణ్ తదితరులు దాశరథి జయంతి వేడుకలకు హాజరయ్యారు.
దాశరథి ఎన్నో అద్భుతమైన రచనలు రాసారని, ఎన్నో మధురమైన సినీ గీతాలను రాసి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారని ప్రముఖులు కొనియాడారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రి అజ్మీరా చందూలాల్ తన ప్రసంగంలో కవులు, కళాకారులను గౌరవించడంలో సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.
మన సొంత తెలంగాణ రాష్ట్రంలో దాశరథి జయంతిని ఇంత ఘనంగా నిర్వహించడం, మన మహాకవులను స్మరించుకునే అవకాశం రావడం ఏర్పడింది అని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఉర్దూలో మాట్లాడుతూ దాశరథి కీర్తిని కొనియాడారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ దాశరథి స్పూర్తితో మన ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టారన్నారు. దాశరథి అన్న “నా తెలంగాణ కోటి రతనాల వీణ” వాక్యం తెలంగాణ రాష్ట్ర సాధనలో సాధనోద్యమానికి కావాల్సిన ఇంధనాన్ని అందించిందని పలువురు ప్రముఖులు కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత వైస్ చాన్సలర్ డాక్టర్ ఎన్.గోపికి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం చేసింది. ప్రొఫెసర్ ఎన్.గోపిని శాలువ, జ్ఞాపికతో సత్కరించారు.
పురస్కార స్వీకర్త ఆచార్య ఎన్. గోపి మాట్లాడుతూ దాశరథి పేరిట గడ్డిపోచును ఇచ్చినా బంగారు కడ్డీగా భావిస్తానని అన్నారు.
దాశరథి పేరుతో ఏర్పరిచిన అవార్డును తంగేడుపూలతో కవిత్వాన్ని ప్రారంభించిన గోపికి ఇవ్వడం ఎంతో గర్వకారణం అని ప్రముఖులు సంతోషం వ్యక్తం చేసారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నిర్వహణలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.