తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్ఠపరిచే దిశగా దృష్టి సారించాం – ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్ఠపరిచే దిశగా దృష్టి సారించామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అందులో భాగంగా వచ్చే (2018-19) విద్యాసంవత్సరంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, ఫార్మసీ, బీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, డీఎడ్, డిగ్రీ కాలేజీలతో పాటు ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించిన అనుబంధ గుర్తింపు, రెన్యూవల్స్ ప్రక్రియను ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించారు. ఆ తర్లాత అఫిలియేషన్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లకు కూడా అనుమతి తీసుకోవాలని, వాటి కోసం వసూలు చేస్తున్న ఫీజులను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 40 నెలలు పూర్తయిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత, సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యాశాఖలు సాధించిన ప్రగతిపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతితో పాటు వచ్చే 20 మాసాలలో విద్యాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, నిర్మాణాలకు సంబంధించి డిసెంబర్ 10 లోగా ఒక రోడ్మ్యాప్ తయారు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్నిరకాల విద్యాశాఖల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం కడియం అధికారులకు సూచించారు. రూ.2,000 కోట్ల నిధులతో చేపట్టిన భవన నిర్మాణాలు వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పూర్తయ్యేలా అధికారులు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. విద్యా వాలంటీర్ల తరహాలో పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలలో ల్యాబులను బలోపేతం చేయాలని ఆధికారులకు సూచించారు.
ఆన్లైన్ ద్వారా పోటీ పరీక్షలు
రాష్ట్రంలో ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీఈసెట్, లాసెట్ వంటి అన్నిరకాల పోటీ పరీక్షలను 2018-19 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కడియం చెప్పారు. యూనివర్సిటీలలో నియామకాలు, కాంట్రాక్ట్ అధ్యాపకులకు గౌరవ వేతనం పెంచే అంశంపై వీసీల కమిటీ నివేదికలను తాము ఆమోదించామని, 70 శాతం వరకు కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతనాలను పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఫైల్ను సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపుతున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగుభాషను తప్పనిసరిగా ఒక బోధనాంశంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం తెలిపారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ, సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్, మేనేజిగ్ డైరెక్టర్ టీ విజయ్కుమార్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ ఏ అశోక్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి శేషుకుమారి, మోడల్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.