చినజీయర్ ..ఆధ్యాత్మిక వేత్త ..ఆధునిక సంస్కర్త ..!
ఎన్నో పార్శ్వాలు..ఇంకెన్నో అనుభవాలు..
ఆయన ముందు మనం మనుషులుగానే మిగిలి పోతాం..
తట్టుకోలేని విద్వత్తు.. ఈ జగత్తంతా
చినజీయర్ నవ్వులోనే సేద దీరుతోందా అన్నట్టు ఆ దేదీప్యమానమైన మోము..
ప్రతి రోజు లక్షలాది మందిని సమ్మోహనం చేసేస్తోంది.
అపారమైన పాండిత్యం..
శరీరం జలదరించేలా జ్ఞానం..
ఆయన నడిచి వస్తుంటే చాలు ప్రకృతి పులకరిస్తుంది.
సర్వ ప్రాణులు స్వేచ్ఛా
విహంగం చేస్తాయి.
ఒక్కో అడుగు అక్కడికే..
ఆ దివ్యమైన హృదయ స్పందన వినేందుకు వేలాది గొంతుకలు ఒక్కటై పోతాయి.
జై శ్రీమన్నారాయణ అంటూ వేడుకుంటాయి.
అదో ఆనందరాగమైన సన్నివేశం..
అదో గుండె నుంచి మరో గుండెకు సాగే నిశ్శబ్ధపు సంచారం..
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దర్శనం కోసం వేల కళ్లు వేచి చూస్తూనే వుంటాయి.
తెల్లవారుజాము నుంచి రాత్రి అంతమయ్యే
దాకా..
ఈ అనంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ పరంపరం కొన్ని ఏళ్లుగా..తరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తూనే వుంది.
కాశీ నుంచి
కన్యాకుమారి దాకా..
దేశం నలుమూలల నుంచే కాకుండా అమెరికా, కంబోడియా, సింగపూర్, నేపాల్, ఆస్ట్రేలియా..తదితర దేశాల నుండి
భక్తజనం దివ్య సాకేత క్షేత్రం వైపు చూపు సారిస్తున్నారు.
అన్ని అడుగులు అటు వైపే సాగుతున్నాయి.
లోలోపటి అంతరాలను దాటుకుంటూ హృదయాలలో ఆధ్యాత్మిక దివ్వెలను వెలిగిస్తూ మరింత ఆత్మ పరిశుద్ధం కోసం ..
రామానుజుల ఆదర్శాలను త్రికరణ శుద్ధితో ఆచరించేలా పాటుపడుతున్న తేజోమూర్తిమత్వం కలిగిన త్రిదండిని దర్శించుకునేందుకు.. అమ్మలా లాలించి ఆకలిని తీర్చే అక్షయపాత్ర లాంటి మనసున్న స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు ఎప్పటి నుంచో వేచి చూస్తూనే వున్నారు.
చినజీయర్ ప్రవచనాలను ఎన్నో ఏళ్ళుగా సావధానంగా వింటున్నారు.
మరికొందరు భక్తులు ఆయన కరుణ కటాక్షం కోసం నిరీక్షిస్తూనే వున్నారు. నిజంగా మనమంతా ఆయన ముందు మానవ మాత్రులమే.
అంతకు మించి ఒక్క అడుగు ఆయనతో పాటు నడవలేం. అందుకోలేం కూడా.
ఇదంతా సాధన వల్ల.. సంస్కారం వల్ల.. విలువైన
జీవితాన్ని త్యాగం చేయడం వల్ల.. అబ్బుతుంది.
పామరులకు అర్థంకాని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, గీతోపదేశాలు, రామాయణ విరిచితాలు అన్నీ ఆయన ముందు చిన్నబోతాయి.
అదో ప్రపంచం నివ్వెర పోయే జ్ఞాన భాండాగారం.
కోట్లాది ప్రజలను ఏకతాటిపై నడిపించే
ఆధ్యాత్మిక ఆయుధం.
త్రిదండి పలుకులు గోదావరమ్మ గలగలలను తలపింప చేస్తాయి. ఆయన బోధిస్తారు.
ఉపదేశిస్తారు.
ప్రవచిస్తారు.
పట్టు తప్పకుండా..పక్కకు వెళ్లకుండా వల్లె వేస్తారు.
ఆయన దగ్గరకు వెళ్లాలంటే దమ్ముండాలి.
ఆయన చల్లని చూపు మన మీద ప్రసరించాలంటే మరో జన్మ ఎత్తాలి. అంత అదృష్టం కోట్లాది భక్తుల్లో కొందరికే దక్కుతుంది.
ఆయన ఇచ్చే తీర్థం కోసం భక్తులు తమను తాము మైమరిచి పోతారు.
ఆ ఎల్లలు లేని..ప్రకృతిని తలపింప చేసే స్వామి కుటీరంలో అంతా సమానులే.
భేదాలు ఉండవు.. కుల, మతాల ప్రస్తావన రాదు..
లోకాన్ని నవ్వించే పాలపిట్టల నవ్వులు కలిగిన ఆ చిన్నారుల అడుగులు దివ్వ సాకేతాన్ని ద్విగునీకృతం చేస్తూనే వుంటాయి.
కోట్ల రూపాయలు నీ దగ్గరున్నా..
నీవు కంపెనీకి యజమాని వైనా.. నీ దగ్గర ఆడి కారున్నా.. లెక్కలేనన్ని బంగ్లాలున్నా ఏవీ స్వామి వారిని ఆకట్టుకోవు.
త్రిదండి ఆరాధన నిండిన ఆ కళ్లు కలువలై పోతాయి.
ఉదయమైతే చాలు పూలై పరవశించి పోతాయి.
అవి భక్తులనే కాదు తన కోసం వేచి చూసే ఆ పిల్లల మోములను పలకరిస్తాయి.
వాళ్లకు ఆయనే తల్లీ..తండ్రీ. గురువు కూడా.. స్వామి హృదయం ఆ కొద్ది సేపు మైదానమై పోతుంది.
వాళ్లతో సంభాషిస్తూనే ఇంకో వైపు భక్తుల బాధలను వింటారు.
అంతటా నిశ్శబ్ధం.
కొందరు సాగిలపడి పోతారు. ఇంకొందరు తమ వైపు చూస్తే చాలు. తమ జన్మ ధన్యమై పోతుందని భావిస్తారు.
అంతటి మహత్తు కలిగిన ఆ ఆధునిక తేజోమూర్తి సేవా మార్గాన్ని ఎంచుకున్నారు.
అంతేనా దానికి ఆధ్యాత్మిక శోభను జోడించారు.
అదే ఇప్పుడు స్ఫూర్తి సమతా శిఖరమై వెలుగులు పంచేందుకు సన్నద్ధమవుతోంది.
ఎన్ని భాషలు.. ఎంతటి విజ్ఞాన భాండాగారం.
ఎక్కడి నుండి వచ్చిందీ ఆ స్థిత ప్రజ్ఞత. ఏమిటి ఆయన వెనుక వున్న శక్తి.. అంతా శ్రీ రామానుజుల చలవేనంటారు చినజీయర్.
ఆ పేరులో అనురాగం వుంది.
ఆ పదంలో లాలిత్యం వుంది.
ఆ పాదాల సవ్వడిలో సరిగమలున్నాయి. అంతటా త్రిదండినే..
ఎటు చూసినా ఆయన నడకనే.
ప్రవచనాల ప్రభంజనంలో భక్త జనం శ్రోతలుగా మిగిలి పోవడమే.
ఎక్కడా మరో ప్రశ్నకు తావుండదు.
పిల్లాడి నుండి పెద్ద వాళ్ల దాకా అందరికీ అర్థమై పోతుంది ఆయనలోని సందేశం.
త్రిదండి జగమెరిగిన ఆధ్యాత్మిక వేత్త అంతేకాదు, ఆధునిక సామాజిక సంఘ సంస్కర్త.
చినజీయర్ కలకాలం వర్ధిల్లాలి..
భక్తిరసంలోని మాధుర్యాన్ని ఈ ప్రపంచానికి పంచుతూనే వుండాలి.
జై శ్రీమన్నారాయణ..!!