జర్నలిజం వృత్తిలో రాణించాలంటే భాషపై పట్టు సాధించాలి, నిరంతరం అధ్యయనం చేయాలి – తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ
జర్నలిస్టులు నిరంతరం అధ్యయనం చేయాలని, జర్నలిజం వృత్తిలో రాణించాలంటే భాషపై పట్టు సాధించాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.
గురువారంనాడు తెలుగు విశ్వవిద్యాలయ జర్నలిజం విద్యార్థుల బృందం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మీడియా అకాడమి కార్యాలయంలో చైర్మన్ అల్లం నారాయణను కలిశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ, జర్నలిజం పవిత్ర వృత్తి అని, ఈ వృత్తిలో పాత్రికేయ విలువలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. రాజ్యాంగం పత్రిక స్వేచ్ఛను కల్పించిందని ఈ హక్కు ద్వారా ప్రజలకు సమాచారాన్ని పారదర్శకంగా అందించాలని అయన అన్నారు. సాధించుకున్న తెలంగాణాలో జర్నలిస్టులు తెలంగాణ సంస్కృతి, చరిత్రలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జర్నలిజం వృత్తిలో ప్రవేశించే వారు కనీసం రెండు ప్రధాన దినపత్రికలు చదవాలని, ఈ రంగంలో వస్తున్న మార్పులను గమనించాలని తెలిపారు. ప్రతి జర్నలిస్టు అక్షర దోషాలు లేకుండ వార్తలు రాయాలని తెలిపారు. వార్తలు నాణ్యమైనవిగా ఉండాలని, జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి బి. రాజమౌళి, తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖాధిపతి సత్తిరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.