క్రిషి కళ్యాణ్ అభియాన్ పథకం అమలు తీరు తెన్నులను సమీక్షించిన – కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి నీరజా శాస్త్రి, ఐ.ఎ.ఎస్
13 జూన్, 2018 న హైదరాబాదులోని వ్యవసాయ కమీషనర్ కార్యాలయంలో వ్యవసాయ కమీషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి నీరజా శాస్త్రి, ఐ.ఎ.ఎస్., క్రిషి కళ్యాణ్ అభియాన్ పథకం అమలు తీరు తెన్నులను సమీక్షించారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1 జూన్, 2018 నుంచి 18 జూలై, 2018 వరకు అమలు చేయాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ సిఫార్సులను అనుసరించి దేశంలోని 115 జిల్లాలను ఈ పథకం అమలుకై గుర్తించారు. ఈ రకంగా గుర్తించిన ప్రతి జిల్లాలో 25 గ్రామాలను ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలను ఈ పథకం అమలుకు ఎంపిక చేశారు.
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో రైతుల సమగ్ర అభివృద్ధికి, ఉత్పత్తుల పెంపుదలకు, ఉత్పాదకత పెంచటానికి ఈ పథకం ఉద్దేశించింది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ఈ పథక లక్ష్యం. అలాగే రైతుల నికర ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. గ్రామంలో అమలుకు ఈ పథకం 10 ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించింది. ఈ పథకంలో – రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ, అపరాలు, నూనెగింజల చిరు సంచులు (మినీ కిట్ల) పంపిణీ, ఉద్యాన/అటవీ/వెదురు మొక్కలను అందజేయడం, ప్రతి గ్రామాన 20 నాడెపు పిట్ లను ఏర్పాటు చేయడం, పాడి పశువులకు 100 శాతం వాక్సినేషన్ జరిగేలా చూడడం, గొర్రెలు, మేకలలో పిపిఆర్ రోగ నివారణ, పశువులకు కృత్రిమ గర్భధారణకు చర్యలు, ఐ.సి.ఏ.ఆర్./కె.వి.కె.ల ఆధ్వర్యంలో వివిధ అంశాలపై గ్రామాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, సూక్ష్మ నీటిపారుదల విధానాన్ని ప్రోత్సహించటానికి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, సమగ్ర పంటల విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామంలో 10 నుంచి 20 వ్యవసాయ పరికరాలను అందజేయడం ముఖ్య లక్ష్యాలని అన్నారు.
క్రిషి కళ్యాణ్ అభియాన్ పథకానికి క్రిషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్లుగా జిల్లా స్థాయి అధికారులుగా, రాష్ట్ర స్థాయిలో మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రిడా) సమన్వయ కర్తగా ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని సమీక్షించిన నీరజా శాస్త్రి, ఐ.ఎ.ఎస్., రాష్ట్ర స్థాయిలో అవసరమైన సర్దుబాట్లు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వ్యవసాయ కమీషనర్ ను కోరారు. అలాగే రైతు సమన్వయ సమితుల సహకారాన్ని తీసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన రోజు వారి నివేదికలను క్రిషి విజ్ఞాన కేంద్రం పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖలు పరస్పర సహకారంతో సమన్వయంతో ఈ పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ పథకం మెరుగైన అమలు కోసం కలెక్టర్ల స్థాయిలో అవసరమైనపుడు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
వ్యవసాయ కమీషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. ఈ పథకం అమలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే పథకం అమలుకు రాష్ట్ర స్థాయిలో సహకరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో క్రీడా శాస్త్రవేత్తలు, కె.వి.కె. కో-ఆర్డినేటర్స్, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్దక శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.