తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి13 నుండి 15 వరకు (మూడు రోజులు) సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు అనుబంధంగా జరిగే ‘ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ‘ నిర్వహణ ఏర్పాట్లపై బేగంపేట లోని పర్యాటక భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.
ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల, దేశాలకు చెందిన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గత సంవత్సరం నిర్వహించిన ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ లో 1000 రకాల స్వీట్స్ ను ప్రదర్శించామన్నారు, ఈ ఫెస్టివల్ లో వివిధ రాష్ట్రాల తో పాటు 15 దేశాల నుండి ప్రతినిధులు వారి సాంప్రదాయ స్వీట్స్ తో స్వీట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ స్వీట్ ఫెస్టివల్ లో సుమారు 8 లక్షల మంది సందర్శకులు పాల్గొన్నారన్నారు. వెయ్యి రకాల స్వీట్స్, వివిధ రకాల పతంగులను ఒకే వేదికపై చూడటానికి సందర్శకులు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బుర్రా వెంకటేశం. ఈ సంవత్సరం నిర్వహించే స్వీట్ ఫెస్టివల్ కు సుమారు 20 దేశాల ప్రతినిధులు స్వీట్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. 10 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమావేశంలో పాల్గొన్న సంఘాల ప్రతినిధులకు సూచించారు.