ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖలు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి – డా. ఎస్.కె.జోషి
ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖలు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన శనివారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పే విధంగా వివిధ కళారూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలుండాలని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సూచించారు.
పోలీసు శాఖ ద్వారా ట్రాఫిక్ క్రమబద్దీకరణ, బందోబస్తు ఏర్పాట్లతో పాటు సరియగు సైనేజెస్ లు (రూట్లు సూచికల బోర్డులు) కూడా ఏర్పాటు చేయాలని తెలియజేశారు. వేడుకలలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు, మీడియా వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేసి సీటింగ్ అరెంజ్ మెంట్లు , వాటర్ ప్రూఫ్ శామియానాలు వేయించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో ఏలాంటి అంతరాయం కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్ కో అధికారులకు ఆయన తెలియజేశారు.
సమాచార పౌర సంబంధాల శాఖ మైక్ ఏర్పాట్లు , ఎల్.ఇ.డి, స్ర్కీన్ లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ సానిటరీ పనులు పూర్తి చేయాలని ముఖ్యమైన వ్యక్తులకు, అతిథులకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. వేడుకలలో పాల్గొనే విద్యార్థినీ, విద్యార్థులతో పాటు పాల్గొనే వారందరికీ మంచి నీటి వసతి, త్రాగునీరు ఏర్పాటు చేయాలని మెట్రో వాటర్ బోర్డు అధికారులకు సూచించారు.
ఆగస్టు 15న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద అమర జవానుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించిన పిదప రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటారని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.
అనంతరం జి.ఏ.డి ముఖ్యకార్యదర్శి శ్రీ అధర్ సిన్హా, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ లు ఇంత వరకు తీసుకున్న చర్యలపై శాఖాధికారులతో చర్చించి తగు సూచనలు జారీచేశారు.
మెట్రో వాటర్ బోర్డు యం.డి. శ్రీ దానకిషోర్ , నగర పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీ కుమార్ , ఐ.జి. లు శ్రీమతి షికాగోయల్ , అభిలాష్ బిష్ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి యోగితా రాణా, సమాచార శాఖ అదనపు సంచాలకులు శ్రీ నాగయ్య కాంబ్లే, సి.ఐ.ఇ. శ్రీ ఎల్.ఎల్.ఆర్. కిషోర్ బాబు వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.