అభివృద్దిలో రాష్ట్రం నెం1…స్వచ్ఛతలోనూ నెం1గా హైదరాబాద్ను నిలపాలి – హోం మంత్రి
సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అగ్రస్థానంలో నిలుపుతున్న మాదిరిగాన్నే హైదరాబాద్ నగరాన్ని కూడా స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలపాలని నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 లో భాగంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఉప్పల్ అంతర్జాతీయ స్టేడియంలో భారీ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 30వేల మందికిపైగా మహిళలు, విద్యార్థులు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛందత సంస్థలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.వి.వి.ఎస్.ప్రభాకర్, ఎం.బి.సి ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి, ముఖ్యమంత్రి ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నిజం చేస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనం స్వచ్ఛంగా ఉంటేనే హైదరాబాద్ స్వచ్ఛంగా ఉంటుందని పేర్కొంటూ….పిల్లలంతా స్వచ్ఛతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా జీహెచ్ఎంసీ స్వచ్ఛత కోసం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు.
మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభానికి ముందే హైదరాబాద్లో స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కిందని అన్నారు.
మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుండి జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సానుకూల సమాధానాలు ఇవ్వడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పరిశుభ్ర నగరాల జాబితాలో ఇప్పటికే మెట్రో నగరాల్లో అగ్రస్థానం సంపాదించామని…. అంతర్జాతీయ నగరాలతో పోటీపడి మరింత మైరుగైన నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుకోవాలని మేయర్ బొొంతు రామ్మోహన్ అన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి మాట్లాడుతూ ప్రతి పౌరుడూ బాధ్యతగా హైదరాబాద్ నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాలని కోరారు. వ్యక్తి గత క్రమశిక్షణ ద్వారా ప్రతి పౌరుడూ చెత్త ఉత్పత్తిని తగ్గించాలని కమిషనర్ జనార్థన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులంతా ఉద్యమంలా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు తల్లిదండ్రుల్లో చెత్త నిర్వహణపై మరింత అవగాహన పెంచాలని సూచించారు.
మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, తడి పొొడి చెత్తను వేరు చేయటంతో పాటు భాగ్యనగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుకునేందు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మనం మారుదాం మన నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛ కార్యక్రమాలపై కవులు, కళాకారులు సుద్దాల అశోక్ తేజ, దేశపతి శ్రీనివాస్ పాడిన పాటలు, మాటలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. హైదరాబాద్ గత వైభవాన్ని పాటల రూపంలో దేశపతి పాడి వినిపించారు. కేసీఆర్ కృషి పై సుద్దాల పాటలు అలరించాయి. జబర్దస్త్ కళాకారుడు రచ్చ రవి స్వచ్ఛ కార్యక్రమాలపై అలరించారు. సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని మద్దతు ప్రకటించారు.
జీహెచ్ఎంసీ కార్యక్రమాలపై ఉప్పల్ డిప్యూటి కమిషనర్ రూపొందించిన ప్రత్యేక ఆడియో సీడిని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. తడి పొడి చెత్తను వేరు చేసి… స్వచ్ఛ దూత్ యాప్ లో అప్ లోడ్ చేసిన వారి నుంచి లాటరీ ద్వాారా ఎంపిక చేసిన ముత్యాలు అనే పారిశుధ్య కార్మికుడికి హోంమంత్రి చేతుల మీదుగా డెబ్బై వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీసి, వావ్, హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్లు
ఈ కార్యక్రమానికి సహకరించడం పట్ల మేయర్ రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ సీనియర్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.